బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం-2022కు వ్యతిరేకంగా ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు తెలిపారు. నగరంలోని బార్ అసోసియేషన్ భవనంలో సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో విధుల బహిష్కరణపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. విధుల బహిష్కరణ సమయంలో న్యాయవాదులు ఏరకమైన దావాలు, సెషన్స్ కేసులు, బెయిల్, ఇతరత్రా విచారణలు చేపట్టరాదని నిర్ణయించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్లు ఈ సమయంలో సాక్షులను ప్రవేశపెట్టకుండా ఉండాలని తీర్మానించారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రాము, ఉపాధ్యక్షులు జి.చంద్రమోహన్, బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు, పొన్నాడ వెంకట రమణరావు, కూన రాజారావు, కె.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.