ప్రారంభించిన మంత్రి అప్పలరాజు
సంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- పలాస
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భావనాలు కట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదేనని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.1.08 కోట్లతో నిర్మించిన ఉప ఖజానా కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం ఉప ఖజానా కార్యాలయ భవనం నిర్మించినట్లు వివరించారు. ఉప ఖజానా కార్యాలయ సేవలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. గత పాలకుల హయాంలో చాలీచాలని వసతులతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల ప్రజల ఇబ్బందులు తొలగించడానికి లక్షల రూపాయల బడ్జెట్తో అన్ని హంగులతో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నారన్నారు. టిడిపి పాలనా కాలంలో పంచాయతీలో సర్పంచ్ కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. సచివాలయ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించి ప్రారంభిస్తున్నామని వివరించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలతో కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలాస ఆర్డిఓ డాక్టర్ భరత నాయక్, శ్రీకాకుళం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరర్ సిహెచ్.రవికుమార్, శ్రీకాకుళం అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు ఎ.తవిటన్న, పి.గోగరాజు, పలాస ఎస్టిఒ లక్ష్మీపురం రామారావు, పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పి.వి.సతీష్, పలాస పిఎసిఎస్ అధ్యక్షులు పైల చిట్టి పాల్గొన్నారు.