నివాళ్లర్పిస్తున్న రవికుమార్ తదితరులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య చేసిన సేవలు శ్లాఘనీయమని సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, జిల్లా ఖజానా అధికారి రవికుమార్ అన్నారు. సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నగరంలోని సంజీవయ్య పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి లేని రాజకీయాలకు సంజీవయ్య చిరునామాగా నిలిచారన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు ఆయన మార్గనిర్దేశకులని కొనియాడారు. విలువలకు కట్టుబడి బతికిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా మూడు దశాబ్దాల పాటు ఎన్నో పదవులు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కె.వేణు, ఎంఆర్పిఎస్ నాయకులు బోసు మన్మథరావు, తైక్వాండో శ్రీను, చంటి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.