మాట్లాడుతున్న ఎస్పి జి.ఆర్.రాధిక
ఎస్పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ప్రజలకు అందించిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని ఎస్పి జి.ఆర్ రాధిక అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తూ బదిలీ అయిన పోలీసు అధికారులకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బదిలీ అన్నది ప్రతి ఉద్యోగికీ సహజమన్నారు. అంకితభావంతో అందించిన సేవలు గుర్తుండిపోతా యని చెప్పారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ డిఎస్పిలు, సిఐలు తీసుకున్న పటిష్ట చర్యలతో నేరాలను కొంతవరకు తగ్గించామని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఏవిధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో అదేవిధంగా పనిచేసే ప్రతిచోటా తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఎఎస్పి (క్రైమ్) టి.పి విఠలేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో మూడున్నరేళ్ల పాటు పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఎస్పి పర్యవేక్షణలో అనేక కేసులు చేధించడాన్ని గుర్తుచేసుకున్నారు. ఎఎస్పి (అడ్మిన్) జె.తిప్పేస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బాధ్యతగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పతకానికి నామినేట్ చేయడంపై ఎస్పి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కొద్దికాలం పనిచేసినా అందరూ సహాయ సహకా రాలు అందించారన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఎఎస్పిలు టి.పి విఠలేశ్వర్, తిప్పేస్వామి, డిఎస్పిలు కె.బాలరాజు, ఎస్.వాసుదేవ్, సిహెచ్.జి. వి.ప్రసాద్, సిఐలు ఆదాం, ఈశ్వర్ప్రసాద్, దాలిబాబు, లక్ష్మణరావు, ఆర్ఐ ఉమామహేశ్వర రావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఎస్పిలు నాగేశ్వర్ రెడ్డి, బాలచంద్రారెడ్డి, శృతి, సిఐలు వేణుగోపాల్, పైడయ్య, అవతారాం, ప్రసాదరావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.