మాట్లాడుతున్న ఈశ్వరరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రైస్ అండ్ ఆయిల్ మిల్ కార్మిక సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 19న జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని శ్రీ చైతన్య రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ హెచ్ ఈశ్వరరావు కో-కన్వీనర్ ఎం.సూరయ్య, సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ రైస్ అండ్ ఆయిల్ మిల్ కార్మికులు జిల్లాలో సుమారు 5వేల మంది ఉన్నారని, వీరు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్ఐ, 8 గంటల పనిదినం తదితర కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వ అండతో యాజమాన్యాలు తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఐఎల్ఒ నిబంధనల ప్రకారం 50 కేజీలు బస్తాలు మాత్రమే వాడాలని, ప్రభుత్వం 100 కేజీలపైన బస్తాలు ఉపయోగించడం వల్ల కళాసీలు బరువులు మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, ఐఎల్ఒ నిబంధన ప్రకారం 50 కేజీల బస్తాలు ఉపయోగించాలని వారు డిమాండ్ చేశారు. రైస్ మిల్ కార్మిక సమస్యలపై ఫిభ్రవరి 19న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అత్యధిక మంది కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు గుండ నీలన్న, రఘునాథ్ పాల్గొన్నారు.