నామినేషన్ వేస్తున్న విజయ
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థానానికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయ గురువారం నామినేషన్ వేశారు. ముందుగా అట్టహాసంగా వేలాదిమంది అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కవిటి మండలంలోని స్వగ్రామం నుంచి నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకున్నారు. డమ్మీ నామినేషన్గా పిరియా రాజారావు నామినేషన్ వేశారు. మండుటెండను లెక్క చేయకుండా మారుమూల గ్రామాల నుంచి కార్యకర్తలు తరలించారు. పట్టణానికి చేరుకొనే సమయానికి రాత్రయ్యింది. ఈ సందర్భంగా విజయ, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ 2024లో ఇచ్ఛాపురంలో వైసిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను సిఎం జగన్ అభివృద్ధి చేశారని అన్నారు. కరోనా సమయంలోనూ ప్రజల మధ్య ఉన్నానని, మీరంతా ఎక్కడికి వెళ్లారని ఎమ్మెల్యే బెందాళం అశోక్, భార్య నీలోత్పలపై ఘాటుగా విమర్శించారు. మీరందరి సేవా చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, నరేష్ కుమార్ అగర్వాల్, చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, సీడాప్ ఎపీ చైర్మన్ శ్యామ్ప్రసాద్రెడ్డి, వైస్ చైర్పర్సన్లు భారతి దివ్య, లాభాల స్వర్ణమణి, ఎంపిపి బోర పుష్ప, జెడ్పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, నర్తు నరేంద్రయాదవ్, తులసీదాస్రెడ్డి, కాళ్ల సత్యం పాల్గొన్నారు.