పిఎస్ఎన్ఎం స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డిఐజి విశాల్ గున్ని
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్ నిర్వహణను విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని సోమవారం పరిశీలించారు. నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన ఓటర్లతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నట్టు తెలిపారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతిఒక్కరు తమ ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు వీలుందన్నారు. జిల్లాలో అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు జరుగుతున్నట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం ఓటర్లు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించు కుంటున్నట్టు తెలిపారు. ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని జూనియర్ కాలేజ్ కృష్ణాపురం, మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన కొర్లకోట, బొబ్బిలిపేట గ్రామాల్లో డిఐజి విశాల్ గున్ని పలు పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఎస్ఐ కె.వెంకటేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.