కుద్దిరాంలో ఎస్ఐ వెంకటేష్కు సూచనలు చేస్తున్న డిఎస్పి శృతి
ప్రజాశక్తి – ఆమదాలవలస
శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, ప్రశాంత వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని డిఎస్పి వై.శృతి అన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసిపి, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను బుధవారం పరిశీలించారు. ఆమదాలవలస పోలీస్ సర్కిల్ పరిధిలో కుద్దిరాం, ఐజె నాయుడు కాలనీ, దన్నానపేట, సరుబుజ్జిలి మండలం చిగురువలసలో పోలీస్ పికెట్లను పరిశీలించిన అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ఎన్నికలు వస్తాయి, పోతాయని వాటి కోసం తగాదాల్లో తలదూర్చి కేసులతో జీవితాలను నాశనం చేసుకోవద్దని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ కె.వెంకటేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.