సుందరయ్య చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న సిబ్బంది
- సిఐటియు సీనియర్ నాయకులు బి.కృష్ణమూర్తి
ప్రజాశక్తి – శ్రీకాకుళం
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సిఐటియు సీనియర్ నాయకులు భవిరి కృష్ణమూర్తి అన్నారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం ఇండిస్టియల్ ఎస్టేట్లోని ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్ కార్యాల యంలో సుందరయ్య వర్థంతి సభను శనివారం నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమం, సంస్కరణల ఉద్యమాల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉందన్నారు. భూసంస్కరణల అమలు కోసం భూ పోరాటాలు సాగించారని చెప్పారు. కమ్యూనిస్టు భావజాల వ్యాప్తి కోసం పత్రిక అవసరాన్ని గుర్తించి ప్రజాశక్తి స్థాపించారని, పత్రిక అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడ్డారని తెలిపారు. ప్రజల కోసం తన ఆస్తులను, జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎడిషన్ మేనేజర్ పి.కామినాయుడు మాట్లాడుతూ సమ సమాజం కోసం సుందరయ్య పనిచేశారని కొనియాడారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళమెత్తి వాటి పరిష్కారం కోసం పనిచేశారని గుర్తు చేశారు. ఎడివిటి జిల్లా ఇన్ఛార్జి టి.బుజ్జిబాబు అధ్యక్షత వహించిన సభలో డెస్క్ ఇన్ఛార్జి జి.లక్ష్మణరావు, స్టాఫ్ రిపోర్టర్ టి.భీమారావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.