ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నసీర్
ప్రజాశక్తి-గుంటూరు : బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిమ్ సోదరులు నమాజ్ చదువుకునేందుకు నగరంలోని ఈద్గాలను ఎమ్మెల్యే నసీర్ ఆదివారం సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ పండుగను సోదరభావంతో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నగరంపాలెం, ఉర్దూ హైస్కూల్, ముస్లిమ్ కాలేజ్ ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వేలాది మంది ముస్లిములు పాల్గొని ప్రార్థనలు చేస్తారని, వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని, ఈద్గాల చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని నగర పాలక సస్థ అధికారులకు సూచించారు. ఫాగింగ్ చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు ఇఇ కోటేశ్వరరావు, ఎస్ఎస్.ఆయుబ్ఖాన్, రామయ్య, రెహమాన్, ముస్లిమ్ మత పెద్దలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/gnt-4.jpg)