ముగిసిన క్రికెట్‌ టోర్నమెంట్‌

టోర్నమెంట్‌ ట్రోఫీతో విజేత జట్టు సీలేరు ఎ టీమ్‌ సభ్యులు

ప్రజాశక్తి-సీలేరు

జికె.వీధి మండలం సీలేరు మారెమ్మ అమ్మవారి 52వ వార్షిక మహౌత్సవం సందర్భంగా యంగ్‌ ప్లేయర్స్‌ ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. శుక్రవారం నాటి ఫైనల్‌ మ్యాచ్లో సీలేరు ఎ టీమ్‌, బి టీమ్‌ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీలేరు ఎ టీమ్‌ జట్టు క్రీడాకారులు నిర్ణీత 10 ఓవర్లలో 111 పరుగులు చేయగా, సీలేరు బి టీమ్‌ జట్టు 66 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సీలేరు ఎ టీమ్‌, ద్వితీయ స్థానంలో నిలిచిన టి టీమ్‌ జట్టులకు ఏపీ జెన్కో పంపు స్టోరేజీ ప్రాజెక్టు ఎస్‌ఈ చంద్రశేఖర రెడ్డి, స్థానిక జల విద్యుత్‌ కేంద్రం ఈఈ లక్ష్మీనారాయణ, సిఆర్పిఎఫ్‌ 42 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సురేష్‌, ఇన్స్పెక్టర్‌ సుభాష్‌ స్థానిక ఎంపిటిసి పిల్లా సాంబమూర్తి, సీలేరు సర్పంచ్‌ దుర్జ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోటీల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన శశి కుమార్‌కు, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ బచ్చులూరుకు చెందిన క్రీడాకారుడు రవికి ట్రోపీలు అందజేశారు. బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా జాన్‌, బెస్ట్‌ బౌలర్‌గా అప్పలరాజు ఎంపికయ్యారు. కార్యక్రమంలో యంగ్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ నాయకులు విష్ణుకుమార్‌, సుందర్‌, పలువురు క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.

➡️