ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా సిహెచ్. తిరుమలరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు నుండి బదిలీపై వచ్చిన ఆయన విధులకు హాజరయ్యే ముందు ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యాలయానికి చేరుకుని బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాభివృద్ధిలో తను వంతు కృషి చేస్తానని చెప్పారు. వివిధ ప్రాంతాలలో చేసిన అనుభవం మేరకు అవసరమైన విధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయరు విజయలక్ష్మి, కౌన్సిల్ సభ్యుల సూచనలు సలహాలతో నగరాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నగరపాలక సంస్థ సిబ్బంది పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు.