జనసేనకు లేని అభ్యంతరం మీకేంటి?సుగుణమ్మకు నారా లోకేష్ ‘క్లాస్’గెలుపు కోసం పనిచేయాలని హితబోధప్రచారం చేసుకోమని ‘ఆరణి’కి భరోసాప్రజాశక్తి – తిరుపతి టౌన్ తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు స్థానికుడు కాదని, నాన్ లోకల్ అని టిడిపి మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మ పది రోజుల నుంచి ఆత్మీయ సమావేశాలు పెట్టి, రెబల్ రాజకీయం నడుపుతున్న తీరుపై టిడిపి యువనేత నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసిన నారా లోకేష్ కుటుంబ సభ్యులను మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మ కలిసారు. కొంతమంది ముఖ్య నేతలతో నారా లోకేష్ సమావేశమై పొత్తులో భాగంగా తిరుపతి ఎంఎల్ఎ టిక్కెట్ జనసేనకు ఇవ్వడం జరిగిందని, లోకల్, నాన్ లోకల్ అంటూ సమావేశాలు, సభలు పెట్టి కార్యకర్తలను గందరగోళం సృష్టించవద్దని క్లాస్ తీసుకున్నారు. జనసేన పార్టీకి లేని అభ్యంతరం టిడిపి నేతలకు ఎందుకని మండిపడినట్లు తెలుస్తోంది. తిరుపతి సీటును టిడిపి వదులుకోవడం తనకూ బాధగానే ఉందని, పొత్తులో భాగంగా తమ ధర్మాన్ని పాటించామన్నారు. టిక్కెట్ల విషయంలో గొడవలు సృష్టించవద్దని సూచించారు. టిడిపి అధికారంలోకి వస్తే పార్టీ ప్రోటోకాల్ పదవిని సుగుణమ్మకు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులే ఉంటారని, అభ్యర్థిని మార్చుకోవడం, పాత అభ్యర్థిని కొనసాగించుకోవడం ఆ పార్టీ నిర్ణయం అని పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గరలో ఉందని టిడిపి శ్రేణులు ఎటువంటి గందరగోళంలో ఉండవద్దని, వైసీపీ అభ్యర్థి ఓటమి కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని వారికి తగినంత గుర్తింపు ఇస్తామని నారా లోకేష్ చెప్పడం విశేషం. ఐవిఆర్ఎస్ సర్వే ప్రకారమే తిరుపతి జనసేన అభ్యర్థి అపార్టీ అధిష్టానం నిర్ణయించిందని పేర్కొన్నారు. దీంతోపాటు టిడిపి పార్లమెంటు తిరుపతి అధ్యక్షులు నరసింహ యాదవ్ తోనూ నారా లోకేష్ చర్చించారు. పార్టీలో అందరికీ టికెట్లు ఇవ్వలేమని, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు అలకలు, కోపాలు మానుకొని గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. నాగబాబు జోక్యం తిరుపతి జనసేన ఎంఎల్ఎ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం నారా లోకేష్ను తిరుమలలో కలిసారు. ‘లోకల్, నాన్ లోకల్’ విషయమై ఫిర్యాదు చేశారు. అయితే ఈ సమస్యపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టిడిపి నేతలు ఖచ్చితంగా కలిసి వస్తారని, రెండు మూడు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జనసేనకు చెందిన కిరణ్రాయల్, రాజారెడ్డి ఆ పార్టీ ఇన్ఛార్జి నాగబాబును గురువారం కలిసారు. ఎంఎల్ఎ అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ గెలుపుకు కలిసి కృషి చేయాలని, లేదంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని నాగబాబు హెచ్చరించినట్లు సమాచారం. నారా లోకేష్ను కలిసిన కోనేటి ఆదిమూలంనారా లోకేష్ను సత్యవేడు సిట్టింగ్ ఎంఎల్ఎ, టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం, జడ్పి ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్కుమార్ మర్యాదపూర్వకంగా తిరుమలలో కలిసారు.