ప్రజాశక్తి – తిరుపతి టౌన్ ఏపీ భూహక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. తిరుపతి కోర్టు ప్రాంగణం నుంచి సుమారు 300 మంది న్యాయవాదులు తిరుపతి పురవీధుల మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. అంతకు ముందు నాలుగు కాళ్ళ మండపం, అంబేద్కర్ విగ్రహం, పాత మునిసిపల్ ఆఫీస్, భవానీ నగర్, స్విమ్స్ కూడలి, ఎన్టీఆర్ సర్కిల్ ముందు నిరసనలతో హోరెత్తించారు. డిసెంబర్ 2 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టులకు హాజరుకాకుండా విధులను బహిష్కరించి నిరసనలు చేపడుతున్నారు. దశలవారీగా వివిధ రూపాలలో నిరసనలు చేపట్టేందుకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకట కుమార్, ఉపాధ్యక్షుడు టి. గోపిచంద్, ప్రధాన కార్యదర్శి ఎం.మురళి, మహిళా ప్రతినిధి వై.కె.మల్లీశ్వరిదేవి, సహాయ కార్యదర్శి గాలి మధు, సీనియర్ న్యాయవాదులు ఎం.ఎన్.మణి, చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు యోగానంద్, బి.ఉషాకిరణ్, టి.దినకర్, మావిళ్ల హరీష్, ఆనంద్, గిరి, మునెయ్య, కష్ణయ్య, రమేష్ , చంద్రయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
![తిరుపతిలో న్యాయవాదుల భారీ బైక్ ర్యాలీ](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-1-copy-189.jpg)