ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలందాలి వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్ లక్ష్మీషాప్రజాశక్తి – తిరుపతి సిటి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులలో ఆధునిక సదుపాయాలు కల్పించి, వైద్య సిబ్బంది నియామకం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తదితర కార్యక్రమాలు అమలు చేస్తోందని, వైద్య వత్తి ఎంతో పవిత్రమైనదని వారి సేవలు ప్రజలకు ఎంతో ముఖ్యమని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. శనివారం రుయా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెంపుల్ సిటీ అయిన తిరుపతి జిల్లాలో ఆసుపత్రులకు వైద్యం కొరకు వచ్చే రోగులకు మంచి వాతావరణం, ట్రీట్మెంట్ ఉండేలా ఆసుపత్రులు ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు ఒక గొప్ప వరం అని సర్జరీలు, చికిత్సలు అవసరమైన పేద ప్రజలకు వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనితీరు ఉండాలని కోరారు. సమావేశానికి ముందు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసియూ, స్పెషాలిటీ వార్డులు, వివిధ విభాగాలను, వాటిలో టాయిలెట్స్ శుభ్రతను పరిశీలించి శానిటేషన్ మెరుగుపడాలని సూచించారు. రుయా ఆస్పత్రిలోని ప్రభుత్వ సీ.టీ స్కాన్ విభాగాన్ని పరిశీలించారు. రోజుకు సరాసరి స్కానింగ్ కు వస్తున్న వివరాలు పరిశీలించారు. నవజాత శిశువుల విభాగం అక్కడ అందుతున్న సేవలు పరిశీలించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ కు వివరిస్తూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవాలు నెలకు సుమారు వెయ్యి జరుగుతున్నాయని, ఇది రాష్ట్రంలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో రెండవది అని అన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్, టీబీసీడి యూనిట్ నిర్మాణం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ యు. శ్రీహరి, రూయ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, స్విమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖరన్, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారథి, స్విమ్స్ సూపరింటెండెంట్ రామ్, డిసిహెచ్ఎస్ ఆనంద మూర్తి, ఈఎస్ ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త రాజశేఖర్, జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ అధికారి తేజేశ్వరి పాల్గొన్నారు.
![ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలందాలి వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్ లక్ష్మీషా](https://prajasakti.com/wp-content/uploads/2024/02/55555555555566666666666666.jpg)