రైతు హంతకుడు మోడీనల్ల చట్టాల రద్దుకై నిరసన ర్యాలీప్రజాశక్తి-శ్రీకాళహస్తి, తిరుపతి టౌన్, గూడూరు టౌన్ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పాలిట నరేంద్ర మోడీ హంతకుడిలా మారాడని రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య విమర్శించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో నల్ల చట్టాల రద్దుకు ఉద్యమించిన ఓ యువ రైతును పోలీసులు తమ కాల్పుల ద్వారా పొట్టన పెట్టుకోవడంపై శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని గత ఏడాది రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే వందల మంది అన్నదాతలు అశువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాల ఫలితంగా నల్ల చట్టాలను రద్దు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసిన కేంద్రం తిరిగి ఏడాది గడుస్తున్నా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఫలితంగా మరోమారు రైతులు ఢిల్లీ బాట పట్టాల్సి వచ్చిందనీ, ఈ క్రమంలో హర్యాణా బోర్డర్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. రైతుల మతికి మోడీనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోడీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. పట్టణ బాధ్యుడు గంధం మణి, నాయకులు పెనగడం గురవయ్య, వేణు, సంక్రాంతి వెంకటయ్య, ఈశ్వరయ్య ,వెలివేంద్రం, ఉస్మాన్ బాషా, గురునాథం, రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ అధ్యక్షతన నిరసన జరిగింది. ఉపాధ్యక్షులు టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువులు, విత్తనాలు సబ్సిడీకి అందించాలని, వ్యవసాయానికి రుణాలు ఇవ్వాలని సుదీర్ఘకాలం పోరాటం చేసిన సందర్భంగా 700 మంది అమరులయ్యారన్నారు. అప్పట్లో తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ దిగి వచ్చి నల్లచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే అమలుకు నోచుకోలేదన్నారు. అన్నదాతలపై మోడీ దాష్టీకాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.బుజ్జి, రఘు, రమేష్, ఎన్.మాధవి, మునిరాజా, పార్థసారథి, రాధాక్రిష్ణ, వాసు, శ్రీరాములు, భగత్ రవి, అక్బర్, రవి పాల్గొన్నారు. గూడూరు టౌన్లో టవర్క్లాక్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. రైతుసంఘం నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ కనీస మద్దతు ధర కోసం దేశవ్యాప్తంగా రైతుల పోరాటాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయన్నారు. పోలీసు కాల్పుల్లో 21 సంవత్సరాల యువరైతు శుభకరన్ సింగ్ మృతిచెందారన్నారు. ఈ మృతులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు బివి రమణయ్య, ఎన్.సురేష్, టి.వెంకటరామిరెడ్డి, అడపాల ప్రసాద్, బి.రమేష్ పాల్గొన్నారు.