స్వర్ణముఖిని తోడేస్తున్నారు.. ఇసుక మాఫియాతో బేజార్రాత్రికి రాత్రే సరిహద్దులు దాటుతోందిమామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులుఅవినీతికి అడ్డాగా ఇసుక రీచ్లుప్రజాశక్తి – తొట్టంబేడు అధికారులకు, అధికార పార్టీ నేతలకు కోట్లు సంపాదించి పెడుతున్న ప్రకతి వనరు ఇసుక. అధికార పార్టీ అండదండలతో కాసుల కక్కుర్తితో ఇసుక బకాసురులు ఖనిజ సంపదను కొల్లగొడుతూ రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖిని తోడేస్తూ రైతులకు కన్నీరే మిగులుస్తున్నారు. ఇసుక బకాసురులకు అంగబలం, అర్థబలం,తో పాటు రాజకీయ, పోలీసుల బలం తోడవడంతో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ఇసుక సరఫరాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హౌసింగ్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకూడదని ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసింది. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రీచ్లు అవినీతి అడ్డాగా మారిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని అరికట్టే దిశగా పలు మార్పులు తీసుకొచ్చారు. పేదల ఇంటి నిర్మాణాలకు అనుగుణంగా ఇసుక సరఫరా చేయాలని రీచ్ లను ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వమే స్వయంగా మైనింగ్ సంస్థ ఏపిఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు జరిపింది.దీని ద్వారా గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయం వచ్చింది. ఒక్క శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే కోట్లలో ఆదాయం వచ్చింది. అదే ప్రభుత్వం అప్పటి వరకు ఏపీఎండీసీ ద్వారా నిర్వహిస్తున్న రీచ్ లను పక్కనపెట్టి గత సంవత్సరంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న జేపీ వెంచర్స్ లిమిటెడ్ వారికి ఇసుక తవ్వకం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయితే గతంలో ఇసుక రీచ్ నిర్వహణ బాగానే ఉంది. స్థానిక ప్రధాన నాయకుడికి భయపడి బాధ్యతలు తీసుకున్న జెపి వెంచర్స్ వాళ్లు రీచ్ లు ప్రారంభించ లేదు. శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం, తొట్టంబేడు మండలంలోని కనపర్తి, పెన్నులపాడు సంబంధించి మూడు రీచ్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఏ ఒక్క రీచ్ ఓపెన్ కాలేదు. ప్రస్తుతం ఓ ‘పెద్దాయన’ అనుచరగణం అనధికారికంగా రీచ్లు నిర్వహిస్తోంది. టైం మార్పు చేసి ఒకే బిల్లు రెండు ట్రాక్టర్లకు వేసి అక్రమంగా డబ్బులు తీసుకుని సరిహద్దులు సైతం దాటేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఒక్కో ట్రాక్టర్ నెలకు పదివేల రూపాయల చొప్పున సమర్పిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక పోలీసు స్టేషన్లకు నెలకు ఐదువేల రూపాయలు వెళ్లిపోతుంటాయి. నిరుపేదలకు ఇసుక ఫ్రీగా తోలుకోవచ్చని జగన్ ప్రభుత్వం చెప్పింది. అయితే వారికి మాత్రం ఇసుక లేనేలేదు. అనధికారికంగా రూ.4000-4,500 ట్రాక్టర్కు ఇచ్చేస్తే మాత్రం ఇసుక ఎంత దూరమైనా అవలీలగా హద్దులు దాటేస్తుంది. ఒక్కో రీచ్లో ఒక్కో నాయకుడు మకాం వేసి రేయింబవళ్లు ఇసుకను స్వర్ణముఖి నుంచి లోడేస్తూ, నెలనెలా అధికారులకు మామూళ్లు నింపేస్తూ, అక్రమార్కుల బండ్లు రోడ్లపై ఉరకలు పెడుతున్నాయి. పంట పొలాలకు వేసుకున్న బోరు పైపులు సైతం వీటికంద పడి పగిలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక రోజుకు ఒకే బిల్లుతో రెండు ట్రాక్టర్లు తోలుకోవచ్చని స్వయానా సెబ్ అధికారులే దగ్గరుండి కథ నడిపిస్తుడడంతో పోలీసు స్టేషన్ ఇసుకాసురులకు కేంద్రంగా మారిందన్న చర్చ నడుస్తోంది. ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేసినా అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారని, తర్వాత ఫిర్యాదు చేసిన వారి భరతం పడుతున్నారని తెలుస్తోంది. గతంలో చిట్టతూరు ఏరు సమీపంలో నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు 40వేలు తీసుకుని వదిలేశారని సమాచారం. ఇసుకాసురులు అక్కడకక్కడా గ్రామాలకు దూరంగా ఇసుక డంప్ చేసి రాత్రికి రాత్రే లారీలతో ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు దాటించేస్తున్నారు. వారం రోజుల క్రితం మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకుని చేతులు తడపడంతో పట్టుకొచ్చిన ట్రాక్టర్లును వదిలేస్తున్నారు. ఇది శ్రీకాళహస్తిలో ఎక్సైజ్ అధికారుల తీరు. ఏదిఏమైనా శ్రీకాళహస్తిలో ఇసుక రీచ్లు అధికార పార్టీకి, ఎక్సైజ్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
స్వర్ణముఖిని తోడేస్తున్నారు.. ఇసుక మాఫియాతో బేజార్రాత్రికి రాత్రే సరిహద్దులు దాటుతోందిమామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులుఅవినీతికి అడ్డాగా ఇసుక రీచ్లు
![స్వర్ణముఖిని తోడేస్తున్నారు.. ఇసుక మాఫియాతో బేజార్రాత్రికి రాత్రే సరిహద్దులు దాటుతోందిమామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులుఅవినీతికి అడ్డాగా ఇసుక రీచ్లు](https://prajasakti.com/wp-content/uploads/2024/04/Un11.jpg)