ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడలో శుక్రవారం ఫార్మేషన్ డే వేడుకలు, జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎపిఐటిఎ, డిజిటల్ మానిటరింగ్ సెల్, డిజిటల్ హబ్ సెంటర్ ను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెఎన్టియు జివి వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీలో నిర్వహించామని తెలిపారు. అత్యంత శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందిన యూనివర్సిటీగా తయారు చేయడానికి అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు. యూనివర్సిటీ తరఫునుంచి ఎల్ అండ్ టి లో ప్లేస్మెంట్ సంపాదించిన 26 మంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎపి ఇన్ఫరేషన్ టెక్నాలజీ అకాడమీ సిఇఒ డివి రామకోటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో జెఎన్టియుజివి బ్రాండెడ్ యూనివర్సిటీగా మార్పు చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. జయ సుమ మాట్లాడుతూ జెఎన్టియు జీవికి అనుబంధంగా ఆరు జిల్లాలో 33 కళాశాలల ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. డిజిటల్ హబ్ గోడ పత్రికను విడుదల చేశారు, కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ గురునాధ, పలు కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపళ్లు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/jntu.jpg)