ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : మిచౌంగ్ తుఫాన్ బాధిత రైతులు, కౌలు రైతులకు సిఎం జగన్ న్యాయం చేస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామి ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ రైతు విభాగం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జోనల్ ఇంచార్జి కడవకొల్లు నరసింహారావుతో కలిసి చల్లపల్లి మండలం పాగోలు పరిధిలో పంటలు పరిశీలించారు. లంకతోట గ్రామంలో కౌలు రైతు కుందేటి కోటేశ్వరరావు చేలో వరి పనలు పరిశీలించారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైతులు, కౌలు రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యం మొత్తం మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.