ప్రజాశక్తి – తణుకురూరల్
చీకటి చట్టం 27ను వెంటనే రద్దు చేయాలని తణుకు న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ యాక్టు 27పై రాష్ట్రంలోని న్యాయవాదులతో ప్రభుత్వం చర్చించి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ భూ యజమానులకు నష్టం కలిగించే చట్టాన్ని వెంటనే నిలుపుదల చేయాలన్నారు. కార్యక్రమంలో తణుకు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెవివి.సత్యనారాయణమూర్తి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, అనుకుల రమేష్, కుసుమే యాకోజురాజు, రవిశంకర్ పాల్గొన్నారు.నరసాపురం టౌన్ : భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల చేపట్టిన నిరసన కొనసాగింది. నరసాపురం బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు బుధవారం కూడా కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం ఈ చట్టం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ పట్టణంలో ‘ప్రజా చైతన్య యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పోలిశెట్టి రఘు రామారావు, పోలిశెట్టి నారాయణ స్వామి (బాబ్జీ), జె.సైమన్ విజయకుమార్, చల్లా దానయ్య నాయుడు, వనమాల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ చట్టం వల్ల రాజకీయ ప్రలోభాలు పెరిగి సామాన్య ప్రజల స్థిరాస్తులకు సంబంధించిన హక్కులు దెబ్బతింటాయన్నారు. అందువల్ల ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నక్కా ఆనందబాబు, కొల్లాటి ఆదినారాయణ, కొత్తపల్లి రమేష్, చేగొండి బాలాజీ, దేవ రంజిత్ కుమార్, అందే మణి పాల్గొన్నారు.