ప్రజాశక్తి – పెనుమంట్ర
మండలంలోని భట్లమగటూరు గ్రామంలోని పొలాల్లో ఆ గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.రవీంద్ర బాబు కథనం మేరకు గ్రామానికి చెందిన పొలమూరి జీవరత్నం కుమారుడు పొలమూరి శివకుమార్(20) ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈనెల 20వ తేదీ రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కొడుకును తండ్రి మందలించడంతో అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా మంగళవారం గ్రామంలో శివకుమార్ విగత జీవిగా కనిపించడంతో తమకు అందిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వెళ్లా మని ఆయన అన్నారు. బుధవారం ఉదయం తణుకు గవర్నమెంట్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిపి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెల్లడించారు.