ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఓక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత
ప్రజాశక్తి – ఆరిలోవ : పిల్లల్లో వచ్చే రెటినో బ్లాస్టోమా అనే కంటి కేన్సర్పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ముందుగా గుర్తించి చికిత్స చేయిస్తే కంటిచూపుతో పాటు పిల్లల జీవితాలను కాపాడుకోవచ్చని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఇనిస్టిట్యూట్ ఓక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత అన్నారు. ఎల్వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో రెటినోబ్లాస్టోమా అనే కంటి కేన్సర్పై అవగాహన కల్పించేందుకు, నిధుల సమీకరణకు ఈ నెల 26న వైట్థాన్ రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబందించిన టిషర్టును విశిష్ట అతిధులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాపారావు, సెక్రటరీ బాలకృష్ణరారు, వైజాగ్ రన్నర్స్ సొసైటీ, ఎల్విపిఇఐ ప్రతినిధులు డాక్టర్ వీరెేంద్ర సచ్దేవ్ సమక్షంలో అర్జున్ పురస్కార గ్రహీత, బాక్షింగ్ కోచ్ సీర జయరామ్ శుక్రవారం ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీర జయరామ్ మాట్లాడుతూ రెటినో బ్లాస్టోమాను ముందుగానే గుర్తించి, చికిత్స అందిస్తే ఎంతో మంది పిల్లల చూపును, జీవితాలను కాపాడవచ్చన్నారు. ఈ వ్యాధిపై ఈ నెల 26న ఆర్కె బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద ప్రారంభమయ్యే వైట్థాన్ అవగాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ, వైట్థాన్ రన్కు సంపూర్ణ మద్దతును అందిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వైజాగ్ రన్నర్స్ సొసైటీ, శారద బేకరీ, ఒమేగా హాస్పిటల్స్కు ధన్యవాదాలు తెలిపారు.
వైట్థాన్ టీ- షర్టు ఆవిష్కరిస్తున్న ముఖ్యఅతిధి సీర జయరామ్, విశిష్ట అతిధులు