మానవాళి చరిత్రలో అత్యంత విషాదానికి దారితీసే విధంగా గాజాలో పరిస్థితి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రిచర్డ్ పీపర్కోన్ చెప్పాడు. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో పౌరుల సామూహిక వధను ఆపాలని, ఐరాస సభ్యదేశాలు ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని పాలస్తీనాలో మానవహక్కులపై ఐరాస ప్రత్యేక నివేదకురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్ కోరారు.. కేవలం హమాస్ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయడం లక్ష్యమని అల్బనీస్ అన్నారు. ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమాస్ సీనియర్ నేత ఒసామా హందన్ చెప్పాడు. గాజాలో మానవ సర్వనాశనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి యత్నాలను తీవ్రతరం గావించాలని కతార్-సౌదీ సమన్వయ కమిటీ కోరింది. తమ వైమానిక దాడుల్లో అనేక మంది హమాస్ నేతలను హతమార్చినట్లు ఇజ్రాయిల్ చెప్పుకుంది..
ఏడు రోజుల విరామంలో హమాస్ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయిల్ జైళ్లల్లో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయిల్ దాడులకు దిగింది. ఇంకా హమాస్ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లల్లో ఉన్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50వేల మంది గాయపడ్డారు.మరికొన్ని వేల మంది శిధిలాల కింద మరణించి ఉంటారని భయపడుతున్నారు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమాస్, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయిల్ ప్రకటించాయి. ఇదిలా ఉండగా బందీల విడుదలకు ప్రధాని నెతన్యాహు ప్రయత్నించడం లేదని అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయిల్ మారణకాండను కొనసాగించడంతో ప్రపంచ మంతటా తీవ్ర నిరసన వెల్లడవుతుండటంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం, దానికి వంతపాడే బిబిసి వంటి మీడియా సంస్థలు, నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న జో బైడెన్ వంటి వారు అరవై రోజుల తరువాత కొత్త పల్లవి అందుకున్నారు. గాజాలోని సొరంగాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న హమాస్ సాయుధులను వెలుపలికి రప్పించేందుకు విష పూరిత వాయువులను పంపాలని గతంలో ఇజ్రాయిల్ ఆలోచించింది. ఇప్పుడు దాని బదులు మధ్యధరా సమద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లోకి పంపాలని చూస్తున్నది.
దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్యూనిస్ పట్టణాన్ని సర్వనాశనం చేసేందుకు మంగళవారం నుండి ఇజ్రాయిల్ సేనలు విమానాలు, టాంకులతో దాడులు జరుపుతున్నాయి. అక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయిందీ ఇంకా వెల్లడి కాలేదు. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలంటూ వెదజల్లిన కరపత్రాలలో పేర్కొన్నారు. తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో జన నష్టం జరగకుండా నిర్దిష్ట సమాచారంతో దాడులు జరుపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయిల్ చూస్తున్నది. జనాన్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లిపోవాలని తరుముతున్న ఇజ్రాయిల్ మిలిటరీ నుంచి అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఒకసారి ఖాళీ చేసిన ప్రాంతానికి తిరిగి అనుమతించటం లేదు. ఖాన్ యూనిస్ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయిలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.యుద్ధ విమానాలు కూడా దాడులు జరుపుతున్నాయి. మరోసారి అక్టోబరు ఏడున హమాస్ జరిపిన మాదిరిదాడులు పునరావృతం కాకుండా చూసేందుకు ఆ సంస్థ మిలిటరీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా తాము దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయిల్ చెబుతున్నది.
అన్ని రకాల మత, నైతిక, మానవతా విలువలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయిల్ ఆక్రమిత పాలస్తీనాలో మారణకాండ జరుపుతున్నదని ఏడు రోజుల దాడుల విరామం, బందీలు, ఖైదీల విడుదల చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన కతార్ పాలకుడు హమద్ అల్ తానీ దోహాలో జరిగిన అరబ్ నేతల సమావేశంలో విమర్శించాడు. ఆత్మరక్షణ పేరుతో ఇదంతా చేస్తున్నారని మారణకాండ నేరాన్ని ఆత్మరక్షణ అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. కతార్లో హమాస్ రాజకీయ కార్యాలయంతో పాటు అనేక మంది నేతలు అక్కడే ఉంటున్నారు. ఇజ్రాయెల్ షిన్బెట్ భద్రతా సంస్థ అధిపతి రొనెన్ బార్ ఒక ఆడియో ప్రకటన చేస్తూ కతార్తో సహా హమాస్ నేతలు ఎక్కడ ఉన్నా వారిని అంతం చేస్తామని బెదిరించాడు. గాజా మీద రెండవ దశ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ సరిహద్దులో ఉన్న లెబనాన్ను కూడా కవ్విస్తున్నది. అక్కడ ఉన్న హిజబుల్లా సాయుధులపై జరిపిన దాడిలో లెబనాన్ మిలిటరీ పోస్టులో ఉన్న ఒక సైనికుడి ప్రాణాలు పోయినట్లు లెబనాన్ ప్రకటించింది. సరిహద్దు ఆవల నుంచి తమ మీద దాడి జరిగిందని, క్షిపణులు జనం లేని చోట పడినట్లు, తమ విమానాలు హిజబుల్లా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ చెబుతున్నది.
గాజాలో జరుపుతున్న నేరాలను ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హితవు చెప్పాడు. అదే జరిగితే మొత్తం ప్రాంత భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించాడు.
హమస్ సాయుధుల జాడ కనుగొనడంలో విఫలమైన ఇజ్రాయిల్ తొలుత వారు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న సొరంగాల్లో విషవాయువులను నింపి వెలుపలికి వచ్చేట్లు చేయాలని చూసింది. తాజాగా వాటిని సముద్రపు నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ దుష్ట ఆలోచన గురించి అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అదే జరిగితే ఇప్పటికే కాలుష్యమైన గాజా ప్రాంతంలో మరిన్ని పర్యావరణ సమస్యలతో పాటు రానున్న అనేక తరాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని, మంచి నీటి వనరులన్నీ ఉప్పునీటితో నిండుతాయని అనేక మంది హెచ్చరిస్తున్నారు. నవంబరు రెండవ వారంలోనే ఆల్ షాతి నిర్వాసిత శిబిరం సమీపంలో ఐదు భారీ పంపులను ఏర్పాటు చేసింది. మధ్యధరా సముద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లో నింపేందుకే ఈ ఏర్పాటు. హమాస్ సాయుధులను ఏరివేసేందుకు తాము అనేక పద్దతుల గురించి పరిశీలిస్తున్నామని వాటిలో ఒకటి నీటితో నింపటమని ఇజ్రాయిల్ మిలిటరీ అధికారి చెప్పినట్లు అమెరికా పత్రిక పేర్కొన్నది. అదే జరిగితే అంతర్జాతీయంగా వెలువడే ఖండనలు జో బైడెన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయని అమెరికా మాజీ అధికారి ఒకడు చెప్పాడు. ఈజిప్టు 2015లో తన భూభాగంలో ఉన్న సొరంగాలను ఉప్పునీటితో నింపి దొంగ రవాణాను అరికట్టేందుకు పూనుకున్నపుడు ఆ ప్రాంత పంటలు దెబ్బతినట్లు రైతులు ఆందోళన చేశారు.అమెరికా ఇతర ఐరోపా ధనికదేశాల అండచూసుకొని చెలరేగుతున్న ఇజ్రాయిల్ మారణకాండకు ఇంకా ఎంత మంది బలికావాలన్న ప్రశ్న తలెత్తింది. ఈ దారుణాన్ని నివారించటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది.
– ఎం కోటేశ్వరరావు