కర్మాగారాల్లో అరవై ఏళ్ళు నిండే వరకూ పని చేసి విశ్రాంతి పొందిన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ (పి.ఎఫ్) సంస్థ పింఛను వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పింఛను మూడు వేల రూపాయలు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుండే రూ.నాలుగు వేలు చెల్లిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. పి.ఎఫ్ పింఛను తీసుకునే వారికి సామాజిక పింఛను పొందేందుకు అర్హత లేదంటూ స్థానిక సచివాలయాల్లో అర్జీ తీసుకోవడం లేదు. ముప్పై ఏళ్లు పైబడి రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసిన వారు అరకొర పింఛను పొందుతుండగా, వృద్ధాప్యంలో బిడ్డలకు భారం కాకుండా ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం సామాజిక పింఛను చెల్లింపులో భారీ వ్యత్యాసం కానవస్తుంది. అయితే కర్మాగారాల్లో పని చేసి అలసి సొలసి ఒళ్ళు హూనమై, అద్దె కొంపల్లో వుంటూ రకరకాల రోగాలు ఆవహించిన పండుటాకులను పరిగణన లోకి తీసుకున్న జాడ లేదు. పి.ఎఫ్ రూ. నాలుగు వేలు చెల్లించాలి. లేదా పింఛను రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించైనా రాష్ట్ర ప్రభుత్వ పింఛను చెల్లించే విధంగా చర్యలు తీసుకొని వృద్ధ కార్మికులు మనోవేదన చెందకుండా సానుభూతితో ఆదు కోవాలి.
– యర్రమోతు ధర్మరాజు