ప్రజాస్వామ్యానికి ఊపిరి వామపక్షాలే

Apr 28,2024 05:06 #editpage

మనం ఇప్పుడు సాధారణ ఎన్నికల ముంగిట్లో వున్నాం. ఈ ఎన్నికల ప్రచార సరళిని చూస్తే చాలు! ప్రజల కోసం పని చేస్తున్నది ఎవరు? మతం కార్డుతో ప్రజల మధ్య చీలికలు తెచ్చి ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నది ఎవరు? అనేది అర్థమౌతుంది. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సమాఖ్య విధానానికి ప్రమాదం పొంచి వున్న నేటి పరిస్థితుల్లో సిపిఎంను, వామపక్షాలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
2004 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పరాజయం పాలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ తగిన మెజారిటీని పొందలేకపోయింది. 61 మంది ఎంపీలతో వామపక్షాలు, 44 మంది ఎంపీలతో సిపిఎం పెద్ద శక్తిగా అవతరించింది. కనీస ఉమ్మడి కార్యక్రమం అమలుకు అంగీకరించేట్లయితే అనే షరతుతో ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి. అందుకు కాంగ్రెస్‌ అంగీకరించి డా. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. ఆ విధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం కారణంగా భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ప్రయోజనం పొందారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) ఉద్యోగ హక్కు ప్రాథమిక హక్కులలో లేనప్పటికీ అమలులోకి వచ్చింది. కరోనా సమయంలో దేశం అకస్మాత్తుగా కఠినమైన లాక్‌డౌన్‌లోకి నెట్టబడినప్పుడు గ్రామీణ, వలస కార్మికులను ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కొంత వరకు కాపాడింది. ఈ రోజు కూడా గ్రామీణ పేదలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది.
అదే సమయంలో సమాచార హక్కు చట్టం కూడా రూపొందించబడింది. ఫలితంగా వివిధ మంత్రిత్వ శాఖలతో సహా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని నేడు పొందగలుగుతున్నారు.
విద్యా హక్కు చట్టం, జాతీయ ఆరోగ్య మిషన్‌, భూసేకరణ చట్టం కూడా కనీస ఉమ్మడి కార్యక్రమ ఫలాలే.
అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కార్మికులలో 92 శాతం మంది వున్నారు. వారికి ఎటువంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు లేకుండా పనిచేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం డాక్టర్‌ అర్జున్‌సేన్‌ గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యమైనది. అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులను విశ్లేషించిన ఆ కమిటీ జాతీయ సాంఘిక భద్రతా పథకానికి సిఫార్సు చేసింది. అలాగే జాతీయ స్థాయి కనీస వేతనం, అసంఘటిత రంగ కార్మికులకు జాతీయ నిధికి కూడా సిఫార్సు చేసింది. అంతేకాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలను కూడా ఆ కమిటీ నొక్కి చెప్పింది.
రవాణా కార్మికుల విషయానికొస్తే, వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి తగిన సిఫారసుల కోసం వి.వి.గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రభుత్వం అప్పగించింది. అసంఘటిత రంగ రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలని వి.వి. గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సిఫారసు చేసింది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినది. కానీ తరువాత రాజకీయ పరిస్థితు లలో వచ్చిన మార్పు కారణంగా ఆ సిఫారసు మరుగున పడింది.
ప్రభుత్వ రంగ పరిశ్రమలను యథేచ్ఛగా విక్రయించడం, మూసివేయడానికి అడ్డుకట్ట వేయబడింది. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోబడ్డాయి. పార్లమెంటులో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా వుండడం వల్ల సమాజంలోని వివిధ వర్గాలు ప్రయోజనం పొందాయి.
ఈ పదేళ్ల మోడీ పాలనలో ఇవన్నీ దాడికి గురవుతున్నాయి. సెక్యులరిజం, రాజ్యాంగం, అన్ని ఇతర సంస్థలు దాడికి గురవుతున్నాయి. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకి కేటాయింపులు తగ్గాయి. పని దినాల సంఖ్య కూడా తగ్గింది. ఆర్‌టిఐ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు మొదలైనాయి.
నూతన విద్యా విధానం (ఎన్‌.ఇ.పి) పేద వర్గాలను ఉన్నత చదువులకు దూరం చేస్తున్నది. 26 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్‌ కోడ్లను ప్రభుత్వం తెచ్చింది. లేబర్‌ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు బానిసత్వంలోకి నెట్టబడతారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్దాక్షిణ్యంగా అమ్మివేయడం నేటి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ”ప్రభుత్వ రంగం పుట్టింది చావడానికే”నని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పారు.
నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకం ద్వారా జాతీయ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. మొత్తంమీద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది. వారి సంపద అనేక రెట్లు పెరిగింది.
ఎలక్టోరల్‌ బాండ్ల సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు దేశాన్ని కుదిపివేసింది. విస్మయపరిచే వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి. తన ప్రయోజనాల కోసం బిజెపి ఎలక్టోరల్‌ బాండ్లను ఏ విధంగా ఉపయోగించుకుందనే విషయమై అనేకానేక కథనాలు వస్తున్నాయి. ఇ.డి, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖల దాడులను ఎదుర్కొన్న కంపెనీలను ఎన్నికల బాండ్లు ఇచ్చిన తర్వాత విడిచిపెట్టారు. కొన్ని కంపెనీలు భారీ కాంట్రాక్టులు పొందాయి. అత్యంత ప్రమాదకరమైన మరొక విషయం ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు నకిలీ మందులను తయారు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. ఆ కంపెనీలు ఎలక్టోరల్‌ బాండ్లను ఇచ్చాక వాటిపై కేసులను ముగించారన్న వార్తలు వచ్చాయి. కొందరు నిపుణులు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని చెప్పారు. వామపక్షాలు మాత్రమే ఎన్నికల బాండ్లను పార్లమెంట్‌లో వ్యతిరేకించాయి. ఎలక్టోరల్‌ బాండ్ల కింద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం మాత్రమే.
మతం పూర్తిగా వ్యక్తిగతమైనది. తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ భారత పౌరులకు వున్నది. మతం రాజ్యంలో జోక్యం చేసుకోకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది? అన్ని రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఓట్లను సమీకరించే సాధనంగా మతాన్ని వాడుకుంటున్నారు. మైనారిటీ ప్రజలను బెదిరించి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు.
వీటన్నిటి ఫలితంగా, ఇప్పుడు దేశం, ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఈ తరుణంలో వామపక్షాలు పటిష్టంగా వుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలను, లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పార్లమెంటులో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా రావాల్సిన అవసరం ఉంది.
వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేసి గెలిపించుకోవాల్సి వుంది.

వ్యాసకర్త ‘ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌’ ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య

➡️