- మాజీ ఐఎఎస్ అధికారి పివి రమేష్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడినని మాజీ ఐఎఎస్ అధికారి పివి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయాన్ని పంచుకున్నారు. కృష్ణా జిల్లా విన్నకోటలో తన పట్టా భూములను మ్యుటేషన్ చేసుకునేందుకు ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు. చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూముల మ్యుటేషన్కు తిరస్కరించారని తెలిపారు. పేరు మార్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించినట్లు చెప్పారు. పోస్టు ద్వారా ఆర్డిఒ పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారని వివరించారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేశారని, ‘ఐఎఎస్ అధికారిగా 36 ఏళ్లు ఎపికి సేవలందించిన నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఒక సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం’ అని ఎక్స్లో పేర్కొన్నారు.