Karnataka – చన్నగిరి పోలీస్‌ స్టేషన్‌పై అల్లరిమూక దాడి – 25మంది అరెస్ట్‌

దావణగెరె (కర్నాటక) : కర్నాటకలోని దావణగెరెలోని చన్నగిరి పోలీస్‌ స్టేషన్‌పై అల్లరిమూక దాడికి సంబంధించి 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. గత శనివారం పోలీసు కస్టడీలో ఉన్న ఆదిల్‌ అనే వ్యక్తి మరణించడంతో అల్లరిమూకలు చన్నగిరి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాయి. పోలీస్‌ స్టేషన్‌ను ధ్వంసం చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కనీసం 11 మంది పోలీసులు గాయపడ్డారని అధికారి తెలిపారు. కేసును సీఐడీకి అప్పగించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇప్పటికే ఉన్న వీడియో క్లిప్‌ల ఆధారంగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మూకుమ్మడి దాడికి పాల్పడిన వ్యక్తులపై ఐపీసీ 353, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

పోలీసు కస్టడీలో చనిపోయిన ఆదిత్‌ ఎవరంటే ?
గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన కేసులో ఆదిల్‌ను మే 24న అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా అతడి ఆరోగ్యం క్షీణించి మరణించాడని అన్నారు. ఆదిల్‌ మరణవార్త అతని కుటుంబ సభ్యులకు తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకుని పోలీసు వాహనాలను ధ్వంసం చేశారనీ, పోలీస్‌ స్టేషన్‌పై రాళ్లు రువ్వారనీ, వాహనాలకు నిప్పు పెట్టారని చెప్పారు.

డిప్యూటీ ఎస్పీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పై సస్పెన్షన్‌ వేటు
పోలీస్‌ స్టేషన్‌పై దాడి అనంతరం చన్నగిరి డిప్యూటీ ఎస్పీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లపై సస్పెన్షన్‌ వేటుపడింది. పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి డిప్యూటీ ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసినట్లు కర్నాటక హోంమంత్రి జి.పరమేశ్వర ఆదివారం తెలిపారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, ఇలాంటి ఘటన జరగకూడదని.. ఇందులో నిర్లక్ష్యం కనిపించిందని పరమేశ్వర అన్నారు. విచారణకు ఆదేశించారు.

విచారణకు హోంమంత్రి ఆదేశాలు
విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి పరమేశ్వర చెప్పారు. ఆదిల్‌ గ్యాంబ్లింగ్‌లో పాల్గొంటుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి మృతి చెందిన విషయం… ఎందుకు, ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తుందన్నారు. అతను గుండెపోటు కారణంగా చనిపోవచ్చు. అయితే విచారణకు ఆదేశించామని తెలిపారు.

➡️