ఒక మిత్రుడున్నాడు బలేచిత్రమైనవాడు
తెలివైనవాణ్ణనుకుంటాడు తనకు తెలిసిందేజ్ఞానమంటాడు
వాడొక పానమట్టం లేని బోడిలింగం
భూగోళం లింగాకారంలోనే ఉందని దబాయిస్తుంటాడు
ఎన్ని రుజువులు చూపినా తనుపట్టిన కుందేలుకు మూడే
కాళ్ళని వాదిస్తుంటాడు
భూమ్మీద ఎన్నిరకాల జాతుల పళ్ళున్నా అతడు కొనేదీ తినేదీ
ఒక్క నారింజపండు మాత్రమే
అన్నిరకాల పువ్వుల్లో కనకాంబరాలే శ్రేష్టమైనవంటాడు
మిరప్పండంటే భయమో కోపమో గానీ అతని వంటింటిలో
దానికి చోటేలేదు
కూరలో కారం వేసుకోడు ఎర్రగా ఉంటుందని
చప్పిడికూడు తినీతినీ రుచులకు దూరమై
ఈకలుమొలిచిన తోలుముక్కయిపోయింది వాడి నాలుక
సింధూరం దిద్దుకున్న నుదురెదురైతే బెదిరిపోతాడు
మందారం తురుముకున్న జడ కనబడితే అదిరిపడతాడు
నారింజరంగును చూడ్డానికి మాత్రమే అలవాటుపడిన వాడి
కళ్ళు ఇంద్రధనసును చూడలేకపోతున్నాయిప్పుడు
సప్తవర్ణమిశ్రమం కాషాయమే అని అతని ప్రగాఢ విశ్వాసం
పొద్దుపొడుపు సమయంలో బయటికి రాడు
అరుణకాంతి తనకు పడదని
చీకటికి అలవాటుపడ్డ కళ్ళు వెలుగును చూడలేవుకదా
ఎరుపును నిషేధించిన వాడి జీవితానికి ఉదయాలెలావస్తాయి?
ఎప్పుడో ‘అపాయం’ అనే హెచ్చరిక బోర్డు కూడా
నారింజరంగులోనే కనిపించి వాడేమైపోతాడోనని భయం నాది.
వాడెప్పుడు తెలుసుకుంటాడో
ప్రమాదానికి గురై ఎక్కడో ఉన్నాడని వాడు నమ్మేవాడు తనని
రక్షించడానికి రాడనీ,
కాపాడాల్సింది ఆస్పత్రిలో వైద్యుడేననీ
తన ఒంట్లోకి ఎక్కించాల్సింది ఎర్రని నెత్తురేనని ..!!
గంటేడ గౌరి నాయుడు9441415182