నేను నా స్నేహితులతో కలిసి విజయవాడలో మదర్ థెరీస్సా ఆశ్రమానికి వెళ్లాం. మాతో పాటు మా స్కూల్ టీచర్స్ కూడా వచ్చారు. అందరం కలిసి ఉదయాన్నే బస్సులో స్కూలు నుంచి బయలుదేరి వెళ్లాము. మాతో పాటు దివ్యటీచర్ వచ్చారు. ఆమె రోడ్డుపై ఉన్న గుర్తుల గురించి అవగాహన కల్పించారు. అనాధ శరణాలయానికి వెళ్లిన తర్వాత వారి కోసం కందిపప్పు, గోధుమపిండి, సోయా చెంక్స్ తీసుకుని వెళ్లాము. నాతోపాటు నా స్నేహితులు బియ్యము, బట్టలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి తీసుకుని వచ్చారు. వాటన్నిటిని అక్కడ సిబ్బందికి అందజేశాము. ఆశ్రమంలో ఒక బోర్డు ఉంది. అందులో మొత్తం 100 మంది ఉన్నారని తెలుపుతూ వారి పేర్లు రాసి ఉన్నాయి. అందులో ఏడుగురు పురుషులు, 83 మంది స్త్రీలు, 10 మంది సిబ్బంది అని తెలుసుకున్నాను. వారితో ఒక గంటసేపు గడిపాము.వారిలో కొంతమందిని పలకరించి పరిచయం చేసుకున్నాను. సుజాత, సీత, లక్ష్మి, రాము అని పేర్లు చెప్పారు. వారు మమ్మల్ని డ్యాన్స్ చేయమని, పాటలు పాడమని అడిగారు. నా స్నేహితులు కొంతమంది వారితో కలిసి పాటలు కూడా పాడారు. వారితో మాట్లాడిన తర్వాత, నాకు చాలా బాధ అనిపించింది. కన్నీళ్లు కూడా వచ్చాయి. భవిష్యత్తులో మా అమ్మ నాన్నలను చక్కగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ చిన్న యాత్ర నా జీవితంలో కొంత మార్పుని తీసుకొని వచ్చింది. ఇటువంటి ప్రదేశానికి తీసుకెళ్లినందుకు అరవింద స్కూలు యాజమాన్యానికి ధన్యవాదాలు.
– ఎన్. ప్రణవ్ సింగ్, 7వ తరగతి, అరవింద హైస్కూల్,కుంచనపల్లి.