కర్నూలు జిల్లాలో బాలోత్సవం ఈనెల 8, 9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుసగా మూడోపిల్లల పండగతో నగరంలోని మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో సందడి నెలకొంది. చిన్నారుల జానపద, శాస్త్రీయనృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన, విచిత్ర వేషధారణ, శాస్త్రీయ, జానపద నృత్యం పోటీలను సీనియర్లు, జూనియర్లుగా విభజించి నిర్వహించారు. మూడు వేదికలు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదిక మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కళ్యాణమ్మ పేరుతో, రెండో వేదిక జెవివి, యుటిఎఫ్ సీనియర్ నాయకులు చెన్నకేశవరెడ్డి కళావేదికగానూ, మూడో వేదిక పిడిఎఫ్ ఎమ్మెల్సీ, యుటిఎఫ్ నేత షేక్సాబ్జీ పేరుతో ఏర్పాటు చేశారు. ఉత్సాహ పూరిత వాతావరణంలో వేడుకలను నిర్వహించారు. రెండు రోజులు జరిగిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొని విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభినయం, లఘు నాటిక పోటీలను నిర్వహించారు.
– పానుగంటి చంద్రయ్య, 94900 99293