ఖర్చు బారెడు…ఆదాయం మూరెడు

Feb 26,2024 11:48 #HCES

అప్పుల ఊబిలో కుటుంబాలు ఇదీ గ్రామీణ భారత పరిస్థితి!

కుటుంబ వినియోగ వ్యయ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ : గత 11 సంవత్సరాలలో ముఖ్యంగా మోడీ ఏలుబడిలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీనికి తగినట్టుగా ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో భారత దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. భారత దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని, జిడిపి దౌడు తీస్తోందని మోడీ అండ్‌ కో సాగిస్తున్న ప్రచారంలో డొల్లతనాన్ని కుటుంబ వినయోగ వ్యయ సర్వే (హెచ్‌సిఇఎస్‌) బయటపెట్టింది. ఖర్చు బారెడు.. ఆదాయం మూరెడు అన్న చందంగా పరిస్థితి తయారైంది. దీంతో చాలా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీని ప్రభావం ఆహార ఖర్చుపైనా పడుతోంది. గత దశాబ్ద కాలంగా దేశంలో ప్రజల ఆదాయాలలో పెద్దగా మార్పు రాలేదు. పైగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో అనేక కుటుంబాలు ఆర్థికంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మూలిగే నక్కపై తాటపండు పడిన చందంగా వినియోగ వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వెరసి సగటు మధ్యతరగతి ప్రజానీకం పరిస్థితి అస్తుబిస్తుగా తయారైంది. కోవిడ్‌ కారణంగా తగిలిన దెబ్బ నుండి పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారుల వద్ద సంపద పెద్దయెత్తున పోగుపడుతోంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శనివారం తాజా కుటుంబ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్‌)ను విడుదల చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గ్రామీణ ప్రాంతంలో నివసించేవారి తలసరి ఖర్చు నెలకు సగటున రూ.3,773 అని తేలింది.. 2011-12లో ఈ వ్యయం రూ.1,430గా ఉంది. అంటే 164 శాతం పెరిగిందన్న మాట. అదే సమయంలో పట్టణ ప్రాంతంలో నివసించేవారి తలసరి వ్యయం రూ.2,630 నుండి రూ.6,459కి పెరిగింది.

కుటుంబ వినియోగ వ్యయ సర్వేలను ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 2017 జూలై-2018 జూన్‌ మధ్య జరిపిన 75వ రౌండ్‌ సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. వినియోగ స్థాయిలకు సంబంధించి గణనీయమైన అంతరాలు కన్పించాయని, అందుకే నివేదికను విడుదల చేయలేదని వివరణ ఇచ్చింది. అయితే బయటికి పొక్కిన సర్వే సమాచారం ప్రకారం వినియోగ వ్యయం పడిపోయింది.

గ్రామీణ ప్రాంతాలలోని చివరి ఐదు శాతం జనాభా సగటు నెలసరి తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) రూ.1,373 ఉండగా 2001లో పట్టణ జనాభాలో చివరి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ రూ.2,001గా నమోదైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని జనాభాలో మొదటి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ రూ.10,501, రూ.20,824గా ఉంది. మరో మాటలో చెప్పాలంటే గ్రామీణ జనాభాలో మొదటి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ దాని చివరి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ కంటే 7.65 రెట్లు అధికంగా ఉంది. పట్టణ జనాభాలోని మొదటి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ దాని చివరి ఐదు శాతం ప్రజల ఎంపీసీఈ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది.

‘ఉచితాల’తో పెద్దగా తేడా లేదుప్రభుత్వం పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చిన ఉచిత వస్తువుల ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో సగటు నెలసరి వినియోగ వ్యయం రూ.3,860, పట్టణ ప్రాంతాలలో రూ.6,521గా నమోదైందని సర్వే నివేదిక తెలిపింది. ఉచిత వస్తువుల విలువను కలపని పక్షంలో వినియోగ వ్యయం గ్రామాలలో రూ.87, పట్టణ ప్రాంతాలలో రూ.62 మాత్రమే పెరిగింది. ఉచిత వస్తువుల విలువను కలిపిన పక్షంలో గ్రామీణ జనాభాలోని చివరి ఐదు శాతం ప్రజలు రూ.1,441 ఖర్చు చేశారు. కలపకపోతే పెట్టిన ఖర్చు రూ.1,373 కంటే ఇది కొంచెం మాత్రమే ఎక్కువ. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఉచిత వస్తువుల విలువను కలపకపోతే రూ.2,001, కలిపితే రూ.2,087 ఖర్చవుతుంది.

ఇది వాస్తవాల పత్రమేవస్తువులు, సేవలపై కుటుంబాల వినియోగానికి సంబంధించి హెచ్‌సీఈసీ సమాచారం సేకరించింది. పది సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఈ సర్వే రిపోర్టు విడుదలైంది. 2017-18 సర్వే ఫలితాలు బయటకు పొక్కడంతో దానిని ప్రభుత్వం రద్దు చేసింది. కోవిడ్‌ కారణంగా 2020-21లో సర్వే జరగలేదు. 2022 ఆగస్టులో ప్రారంభమైన సర్వే గత జూలై వరకూ కొనసాగింది.

➡️