విశాఖ : విశాఖ టెస్టులో టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లండ్పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుకెక్కాడు. గతంలో ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్పై 95 వికెట్లు తీశాడు. ఇప్పుడా రికార్డును అశ్విన్ అధిగమించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 92, బిషన్ సింగ్ బేడీ 85, కపిల్ దేవ్ 85, ఇషాంత్ శర్మ 67 వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
అలాగే అశ్విన్ విశాఖ టెస్టులో తీసిన 3 వికెట్లతో టెస్టుల్లో అతడి మొత్తం వికెట్ల సంఖ్య 499కి చేరింది. మరొక్క వికెట్ పడగొడితే అశ్విన్ 500 వికెట్ల మార్కును అందుకుంటాడు. కెరీర్లో ఇప్పటివరకు అశ్విన్ 97 టెస్టులు ఆడాడు. వికెట్ల సగటు 23.92 కాగా… 34 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.