న్యూఢిల్లీ : ప్రపంచ మాజీ వరల్డ్ నం.1 ఆర్చర్, భారత స్టార్ దీపిక కుమారి ప్రపంచకప్ స్టేజ్ 2 మెడల్ వేటలో గురి తప్పింది. మాతృత్వ సెలవుతో ఆర్చరీకి దూరంగా ఉన్న దీపిక కుమారీ పునరాగమనంలో తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత్ నుంచి దీపిక కుమారి మినహా ఎవరూ మెడల్ రేసుకు చేరుకోలేదు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగం సెమీఫైనల్లో వరల్డ్ నం.2, దక్షిణ కొరియా షట్లర్ లిమ్ 6-2తో గెలుపొందింది. 28-26, 28-28, 28-27, 27-27తో లిమ్ పైచేయి సాధించింది. గత నెల షాంఘై వరల్డ్కప్లో పసిడి వేటలో లిమ్కు దీపిక కుమారి తలొంచిన సంగతి తెలిసిందే. ఇక కాంస్య పతక పోరులోనూ దీపిక కుమారికి నిరాశ తప్పలేదు. వరల్డ్ నం.3 వెలెన్సియ (మెక్సికో) చేతిలో 4-6 (26-29, 26-28, 28-25, 27-25, 26-29)తో నిరాశపరిచింది. కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్లు రెండు పతకాలు సాధించారు. మహిళల జట్టు విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/deepika.jpg)