- హెడ్, నితీశ్ అర్ధసెంచరీలు
- సన్రైజర్స్ హైదరాబాద్ 201/3
హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-17లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగుల వద్దే పరిమితమైంది. ఐదో ఓవర్లో అవేశ్ ఖాన్ వేసిన తొలి బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి అభిషేక్(12) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ప్రీత్(5) తొలి బంతికే ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో సందీప్ శర్మ వేసిన బంతికి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన సన్రైజర్స్ కాసేపు నిలకడగా ఆడింది. కానీ 9వ ఓవర్ నుంచి ట్రావిస్ హెడ్ (58) దూకుడు పెంచాడు. అతనికి నితీశ్రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన స్కోర్ అందించారు. అయితే అవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి స్టంపౌట్ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెడ్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్ (40) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్ను ఎట్టకేలకు 200 దాటించారు. రాజస్థాన్ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
స్కోర్బోర్డు..
సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి)ఆవేశ్ ఖాన్ 58, అభిషేక్ శర్మ (సి)ధృవ్ జురెల్ (బి)ఆవేశ్ ఖాన్ 12, అన్మోల్ప్రీత్ సింగ్ (సి)జైస్వాల్ (బి)సందీప్ శర్మ 5, నితీశ్ రెడ్డి (నాటౌట్) 76, క్లాసెన్ (నాటౌట్) 42, అదనం 8. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 201పరుగులు.
వికెట్ల పతనం: 1/25, 2/35, 3/131
బౌలింగ్: బౌల్ట్ 4-0-33-0, అశ్విన్ 4-0-36-0, ఆవేశ్ ఖాన్ 4-0-39-2, సందీప్ శర్మ 4-0-31-1, చాహల్ 4-0-62-0