బోర్డు ఒకచోట.. కౌంటర్ మరోచోట..ప్రజాశక్తి-శ్రీకాళహస్తిశ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అధికారులు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన ఉండదు. పారదర్శకంగా ఉన్నట్లు పైకి చెబుతున్నా లోపల మాత్రం మరేదో దాగి ఉంటుంది. అందుకు రూ.200ల ప్రత్యేక దర్శనం కౌంటరే ఉదాహరణ. ఓంకార స్వామి మఠం వద్ద పిఆర్ఓ కార్యాలయాన్ని, రూ.200ల ప్రత్యేక దర్శనం కౌంటర్ను దేవస్థానం అధికారులు ఇటీవల ఏర్పాటు చేశారు. అయితే పిఆర్ఓ కార్యాలయాన్ని అక్కడే ఉంచి రూ.200ల టికెట్ కౌంటర్ను మాత్రం ధూర్జటి గ్రంథాలయం వద్దకు మార్పు చేశారు. పిఆర్ఓ కార్యాలయానికి వచ్చిన భక్తులు అక్కడే 200 రూపాయల టికెట్ కొనుగోలు చేసి ప్రత్యేక దర్శనానికి వెళ్లేవారు. ప్రముఖులైతే పిఆర్ఓ కార్యాలయ సిబ్బంది కూడా వెళ్లేవారు. టికెట్ కౌంటర్ను ఎత్తివేయడంతో పిఆర్ఓ కార్యాలయం సిబ్బంది మాత్రమే భక్తులతో వెళుతున్నారు. టికెట్లు మాత్రం కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆలయానికి ఆదాయం రావడం లేదు. ఈ ఆదాయం కొందరు దళారుల జేబుల్లోకి వెళుతోంది. టికెట్ కౌంటర్ కూడా పిఆర్ఓ కార్యాలయంలోనే ఉంటే భక్తులు అక్కడే టికెట్ కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లేవారు. దళారుల సంక్షేమం కోసం దేవస్థానం అధికారులు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.