China లో భారీ వర్షాల బీభత్సం – హైవే రోడ్డు కూలి 36మంది మృతి

చైనా : గత కొద్ది రోజులుగా చైనాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ దేశం తీవ్ర అవస్థలుపడుతోంది. వర్షాల ధాటికి బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గ్వాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌ లోని మిజౌ, డాబు కౌంటీల మధ్య ఉన్న హైవేలోని రోడ్డు కుంగిపోయింది. కొండిపాంతంలో ఉన్న ఆ రోడ్డు కింది భాగంలోని మట్టి మొత్తం వరదలో కొట్టుకుపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆకస్మాత్తుగా ఇలా జరగడంతో వేగంగా వచ్చిన వాహనాలన్నీ ఆ గోతిలో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో 36 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు మెయిజౌ నగర ప్రభుత్వం తెలిపింది. హైవేపై ఉన్న 20 వెహికల్స్‌ పడిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 36 మందికి పైగా మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గాయపడినవారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక, 500 మంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు … గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలో వడగళ్ల వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. గత వారాంతంలో ప్రావిన్షియల్‌ రాజధాని గ్వాంగ్‌జౌలో సుడిగాలి దెబ్బకు ఐదుగురు మరణించారు. మెయిజౌలోని కొన్ని గ్రామాలు ఏప్రిల్‌ ప్రారంభంలో ముంపునకు గురయ్యాయి.

➡️