తైపీ : తూర్పు ఆసియా దేశంలోని తైవాన్ను వరుస భూకంపాలు వణికించేస్తున్నాయి. నిన్న (సోమవారం) అర్ధరాత్రి గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ప్రస్తుతం అక్కడ ప్రకంపనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భూకంపాల ధాటికి కొన్ని భవనాలు నేలమట్టం కాగా, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏప్రిల్ తొలివారంలో ఈ ద్వీప దేశం భారీ భూకంపంతో గజగజలాడిపోయిన సంగతి విదితమే.
ఏప్రిల్ 3 నుండి తరచూ భూకంపాలు…
తైవాన్ తూర్పు ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి రాజధాని తైపీలో భవనాలు ఊగిపోయాయి. భూకంప కేంద్రం హువాలిన్లో నమోదు అయ్యిందని, ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రకంపనలు నమోదు అయ్యాయని, వాటిల్లో రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రత అధికంగా నమోదు అయ్యిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏప్రిల్ 3వ తేదీన ఈ ప్రాంతంలోనే భూకంప కేంద్రం నమోదు కాగా.. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ఏప్రిల్ 3 నాటి భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్, వంతెనలే ఊగిపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే 14 మంది మరణించారు. అప్పటి నుంచి తరచూ ఆ దేశంలో భూమి కంపిస్తూనే వస్తోంది.
పాతికేళ్ల తరువాత భారీ భూకంపం…
రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండడంతో తైవాన్ భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. 1993లో రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా.. 2000 మంది మరణించారు. ఆ తర్వాత 2016 లో ఆ దేశం దక్షిణ ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 100 మంది మరణించారు. ఏప్రిల్ 3వ తేదీన సంభవించిన భూకంపం తైవాన్లో పాతికేళ్ల తర్వాత సంభవించిన భారీ భూకంపంగా నమోదు అయ్యింది.