అమెరికాలో భారతీయ విద్యార్థిపై దాడి

Feb 7,2024 11:03 #America, #Indian student
  • విదేశాంగ మంత్రికి బాధితుడి భార్య కీలక లేఖ

చికాగో : ఇటీవల అమెరికాలో నలుగురు భారత విద్యార్థులు మృతి చెందిన విషయం మరువక ముందే మరో భారతీయ విద్యార్థిపై తాజాగా దాడి జరిగింది. ముగ్గురు నిందితులు ఓ స్టూడెంట్‌పై దాడికి పాల్పడగా తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ యూఎస్‌లోని వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేయడానికి చికాగోలోని తను ఉండే ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు అతన్ని వెంబడించి దాడికి పాల్పడ్డారు. నిందితులు విద్యార్థిని వెంబడిస్తున్న దృశ్యాలు సీసీపుటేజీలో రికార్డైంది. ఘటన అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న అలీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాకు సహాయం చేయాలని కోరారు. తనను తీవ్రంగా కొట్టినట్టు తెలిపారు. ఈ విషయం తెలుసిన విద్యార్థి భార్య భారత విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. ‘చికాగోలో ఉన్న నా భర్త భద్రతపై ఆందోళన చెందుతున్నా. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సహాయం చేయండి. నా భర్తతో కలిసి ఉండటానికి యూఎస్ వెళ్లాలనుకుంటున్నా. వీలైతే దానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి’ అని లేఖలో పేర్కొంది. కాగా, గత నెలలోనే శ్రేయాస్ రెడ్డి, నీల్ ఆచార్య, వివేక్ సైనీ, అకుల్ ధావన్ అనే నలుగురు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థిపై దాడి జరగడం గమనార్హం.

➡️