గాజాలో పోషకాహార సంక్షోభం: యునిసెఫ్‌

గాజా : గాజాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యునిసెఫ్‌ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. గాజా వ్యాప్తంగా ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా వున్నాయని తెలిపింది. ఇజ్రాయిల్‌ సైన్యం జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 29వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. మొత్తంగా నివాస ప్రాంతాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. 80శాతానికి పైగా జనాభా నిర్వాసితులయ్యారు. యునిసెఫ్‌ నేతృత్వంలో గ్లోబల్‌ న్యూట్రిషన్‌ క్లస్టర్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గాజాలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 90శాతానికి పైగా పిల్లలు రోజుకు రెండు లేదా అంతకంటే తక్కువ ఆహార రకాలు తింటున్నారని పేర్కొంది. ఇది తీవ్ర ఆహార దారిద్య్రం కిందకు వస్తుందని పేర్కొంది. అంటువ్యాధులతో బాధపడుతున్న పిల్లలు కూడా దాదాపు 90శాతం మంది వున్నారని తెలిపింది. గత రెండు వారాల్లో 70శాతం మంది డయేరియాతో బాధపడుతున్నారని పేర్కొంది. గాజాలో 80శాతానికి పైగా ఇళ్లకు పరిశుద్ధమైన, సురక్షితమైన నీరు అందుబాటులో వుండడం లేదు. సగటున ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఒక రోజుకు ఒక లీటరు నీరు లభ్యమవుతోందని ఆ నివేదిక తెలిపింది. మానవతా సాయం చాలావరకు అందుతున్న దక్షిణ ప్రాంత నగరమైన రఫాలో తీవ్రమైన పోషకాహార సమస్య 5శాతంగా వుంది. అదే సమయంలో ఉత్తర గాజాలో 15శాతంగా వుంది. యుద్ధానికి ముందు గాజా వ్యాప్తంగా పోషకాహార సమస్య ఒక శాతం కన్నా తక్కువగానే వుందని నివేదిక పేర్కొంది.

➡️