లండన్ : లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత పిహెచ్డి విద్యార్థిని మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భారత పరిశోధక విద్యార్థిని చెయిస్తా కొచ్చర్ (33) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన కళాశాల నుంచి సైకిల్ తొక్కుకుంటూ సెంట్రల్ లండన్లోని తన ఇంటికి వెళుతుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు సైకిల్ను ఢకొీట్టింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తీవ్రగాయాల పాలైన కొచ్చర్ అప్పటికే మరణించారు. ఈ విషయాన్ని తాజాగా కొచ్చర్ తండ్రి రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్పి కొచ్చర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె భౌతికకాయాన్ని తీసుకురావడానికి ఆయన లండన్ వెళ్లారు.
గురుగ్రామ్లో నివాసముండే చెయిస్తా.. సెప్టెంబరులోనే పిహెచ్డి కోసం లండన్ వెళ్లారు. గతంలో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్లోని నేషనల్ బహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్లో సీనియర్ సలహాదారుగా సేవలందించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/london-accident.jpg)