న్యూయార్క్: ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన ప్రజావేగు జాషువా డీన్ (45) అనుమానాస్పదంగా మరణించారు. బోయింగ్ సప్లయర్ అయిన స్పిరిట్ ఏరో సిస్టమ్స్లో గతంలో క్వాలిటీ ఆడిటర్గా వ్యవహించిన డీన్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో రెండు వారాల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎక్మో కూడా అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరించడం వల్ల ఆయన మరణించారు. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన జాన్ బార్నెట్ ఆత్మహత్యకు పాల్పడిన రెండు నెలలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల తయారీలో లోపాలను స్పిరిట్ సంస్థ పట్టించుకోవడం లేదని డీన్ ఆందోళన వ్యక్తం చేశారు. విమాన లోపాలను బయటకు వెల్లడించారన్న కారణంతో ఆయన్ను గతేడాది ఏప్రిల్లో ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు బోయింగ్ 787 డ్రీమ్లైనర్ తయారీలో ప్రమాణాలు పాటించడం లేదంటూ బెర్నాట్ కూడా సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేశారు. లోపాలు బయటపెట్టినందుకు దావా కూడా ఎదుర్కొన్నారు. దాదాపు 32 ఏళ్ల పాటు బోయింగ్లో పని చేసిన ఆయన 2017లో రిటైర్ అయ్యారు. ఈ ఏడాది మార్చి 9న బెర్నాట్ తనంతట తానే గాయపరుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.విమానాల్లో లోపాలు బయటపెట్టిన ఇద్దరు ఉద్యోగులపై బోయింగ్ పగబట్టిందంటూ రెండేళ్ల క్రితమే బోయింగ్కు చెందిన ఒక యూనియన్ ఆరోపించింది. ఈ క్రమంలో వరుస ఉదంతాలు జరగడం గమనార్హం. మరోవైపు గతంలో బోయింగ్ ఇంజినీర్గా పనిచేసిన మరో ప్రజావేగు సామ్ సలేపూర్ ఇటీవల అమెరికా సెనేట్లో పలు కీలక విషయాలను బయటపెట్టాడు. ఉత్పత్తి అవరోధాలను అధిగమించడానికి బోయింగ్ కంపెనీ షార్ట్కట్ మార్గాన్ని ఎంచుకుంటోందని పేర్కొన్నాడు. దీనివల్ల విమాన ప్రయాణంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. దీనివల్ల కంపెనీ భద్రత, విమాన లైఫ్ సైకిల్ కూడా తగ్గుతుందన్నాడు. బోయింగ్ విమానాలు పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఆ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడింది. అంతకుముందు ఇండోనేషియా, ఇథియోపియాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇవే విమానాలు 346 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్నాయి.