నాగ్పూర్ : నాగ్పూర్లోని కటోల్ తాలూకాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందగా మరో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్పూర్లోని కటోల్ తాలూకా మెంధేపత్తర్ బజార్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చిఖాలే కుమార్తె వివాహం నాగ్పూర్లో జరిగింది. పెళ్లి అనంతరం ఇంటికి పయనమైన వారి కారును అతి వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని నాగ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు. అజయ్ దశరథ్ చిఖాలే (45), విఠల్ దిగంబర్ తోటే (45), సుధాకర్ రామచంద్ర మాన్కర్ (42), రమేష్ ఓంకార్ హౌలాండే (48), మయూర్ మోరేశ్వర్ ఇంగ్లే (26), వైభవ్ సాహెబ్రావ్ చిఖాలే (32) ఇందులో మరణించారు. పెళ్లి అనంతరం ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/road-acident-1.jpg)