పోలీసులుగా బెదిరించి.. మహిళపై సామూహిక లైంగిక దాడి

Nov 26,2023 15:15 #Gang Rape

భోపాల్‌: పోలీసులుగా బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రైల్వే స్టేషన్‌లో భర్తతోపాటు ఉన్న మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌ నగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మహిళ, భర్తతో కలిసి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లేందుకు ముంగవోలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే తాగుడుకు బానిస అయిన మహిళ భర్త మద్యం కోసం స్టేషన్‌ బయటకు వెళ్లాడు. అతడు ఆలస్యంగా రైల్వే స్టేషన్‌కు తిరిగి వచ్చాడు. దీంతో ఎక్కాల్సిన రైలును ఆ దంపతులు మిస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ ఆ రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. కాగా, ఇద్దరు వ్యక్తులు ఆ దంపతుల వద్దకు వచ్చారు. తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. వారి టిక్కెట్లు తనిఖీ చేసి వివరాలు అడిగారు. ఆ వ్యక్తులు సివిల్‌ డ్రెస్‌లో ఉండటంతో ఐడీ కార్డు చూపించాలని వారు అడిగారు. ఈ నేపథ్యంలో మహిళ భర్త, ఆ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక వ్యక్తి మహిళ భర్తను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. మరో వ్యక్తి మహిళను సమీపంలోని చెట్ల వద్దకు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం రెండో వ్యక్తి కూడా ఆ మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ప్రభుత్వ రైల్వే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

➡️