ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింస కొనసాగుతున్నది. గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెయితీలు, కుకీల ప్రాబల్యం ఉన్న జిల్లాల సరిహద్దులో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఫలితంగా రెండు వేర్వేరు సంఘటనల్లో కనీసం ఐదుగురు మెయితీలు గురువారం మరణించారు. బుధవారం రాత్రి లోయలోని తౌబాల్ జిల్లాలో పోలీసు సంస్థల నుంచి ఆయుధాలను దోచుకునే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో ముగ్గురు బిఎస్ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ నెల 17న మిలిటెంట్ గ్రూపులు, భద్రతా దళాల మధ్య కాల్పుల్లో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బి) జవాను, మణిపూర్ రైఫిల్స్ జవాన్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రధాని మౌనం వీడి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకుడు పవన్ఖేరా, ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.