కేరళలో కుండపోత వాన – 11మంది మృతి

May 25,2024 13:25 #11, #dead, #kerala, #Torrential rain

కేరళ : కేరళలో కుండపోత వాన కురుస్తోంది. గత రెండు రోజులుగా కేరళలో వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్‌, మలప్పురం, కోజికోడ్‌, వయనాడ్‌ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి.

7 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ….
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఏడు జిల్లాలకు శనివారం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. ఈ జిల్లాల్లో 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

11 మరణాలు నమోదు : కేరళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్‌
భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్‌ తెలిపారు. మే 9 నుంచి 23 వరకూ ఈ మరణాలు నమోదైనట్లు చెప్పారు. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించగా.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుబాటుకు ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మరణించినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రవాహాలు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

➡️