పూణే : ఐసిస్ కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఎ సోదాలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తోన్న ఈ సోదాల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసింది. ఐసిస్ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్తో సహా పలు ప్రాంతాల్లో ఎస్ఐఏ ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు కర్ణాటకలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. పుణెలో రెండు చోట్ల, ఠాణెలో 40 చోట్ల , కర్ణాటకలో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.ముంబై పక్కనే ఉన్న థానె, పూణేలతో పాటు మిరాభయాందర్లలో ఎన్ఐఏ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఆకిఫ్ అతీఖ్ నాచన్ సహా ఏడుగురిని అరెస్టు చేసింది. నాచన్ ఆగస్టులో పేలుడు పదార్థాల తయారీ కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి తిరిగి టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిసిందన్నారు. దీంతో ఈ కేసుతో సంబంధమున్న వారందరినీ పట్టుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్ఐఏ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.