యుపిలో తాండవిస్తున్న నిరుద్యోగం
లక్నో : ఉత్తర ప్రదేశ్లో నిరుద్యోగం తాండవిస్తోంది. 60,244 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏకంగా 50,14,924 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 35 లక్షల మంది పురుషులు, 15 లక్షల మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ విధానం ప్రకారం మహిళా అభ్యర్థులకు 20 శాతం పోస్టులు ఉన్నాయి. 12,049 మంది మహిళలు ఉద్యోగాలు పొందనున్నారు. అంటే ఒక ఉద్యోగానికి 124 మంది పోటీ పడుతున్నారు. 49,195 మంది పురుషులు పొందనున్నారు. ఒక ఉద్యోగానికి 73 మంది పోటీ పడుతున్నారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… యుపిపిఆర్పిబి ఆధ్వర్యాన యుపి పోలీస్ కానిస్టేబుల్ – 2024 పరీక్షలను 75 జిల్లాల్లోని 2,385 కేంద్రాల్లో శని, ఆదివారాల్లో నాలుగు షిఫ్టుల్లో నిర్వహించారు. దరఖాస్తుదారుల్లో ఆరు లక్షల మందికిపైగా ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. బీహార్ 2,67,305, హర్యానా 74,769, జార్ఖండ్ 17,112, మధ్యప్రదేశ్ 98,400, ఢిల్లీ 42,259, రాజస్థాన్ 97,277, ఉత్తరాఖండ్ 14,627, పశ్చిమ బెంగాల్ 5,512, పంజాబ్ 3404, మహారాష్ట్ర 3,151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో 22 జిల్లాలకు చెందిన 120 మందిని పరీక్ష రాసేటప్పుడు అక్రమాలకు పాల్పడినందుకు అరెస్టు చేశారు.
సన్నీ లియోన్ దరఖాస్తు?
రిక్రూట్మెంట్ పరీక్ష అడ్మిట్ కార్డ్లో సినీ నటి సన్నీ లియోన్ పేరు, ఫొటో కనిపించింది. అడ్మిట్ కార్డు ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అడ్మిట్ కార్డ్లో శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజ్, తిర్వా, కనౌజ్ పరీక్షా కేంద్రంగా పేర్కొనబడింది. ఈ చిరునామా ముంబైలో ఉంది. మహోబాకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నెంబర్ను ఉపయోగించి దరఖాస్తు పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కనౌజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.