- బిజెపికి షాకిచ్చిన ఆర్ఎల్జెపి అధ్యక్షుడు
కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ రాజీనామా
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జెపి) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా సీట్ల పంపకం విషయంలో తమ పార్టీని పట్టించుకోకుండా బిజెపి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. పశుపతి కుమార్ గ్రూపు వాదనలను పట్టించు కోకుండా బీహార్లో లోక్సభ సీట్ల పంపకంలో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి(రామ్ విలాస్)కి ఐదు సీట్లను కేటాయించిన బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ దీనిపై ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ అంశంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న పశుపతి కుమార్.. ఆ తర్వాత విలేకరుల సమావేశం రోజే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ప్రకటన చేయటం గమనార్హం. తన భవిష్యత్ ప్రణాళిక గురించి ఆయన వివరించలేదు. సీట్ల పంపకం విషయంలో తమ పట్ల వ్యవహరించిన విధానంపై తన అసంతృప్తి గళాన్ని వినిపించటానికి ముందు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించటానికి తమ పార్టీ నాయకులం సమావేశమవుతామని ఆర్ఎల్జెపి అధికార ప్రతినిధి శ్రవణ్ అగర్వాల్ తెలిపారు. పశుపతి కుమార్ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు.
బాబాయ్, అబ్బాయిల మధ్య బిజెపి చిచ్చు
లోక్జనశక్తి పార్టీ (ఎల్జెపి)ని వాస్తవానికి కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 2000లో స్థాపించారు. 2020లో రామ్ విలాస్ మరణం తర్వాత పార్టీని హస్తగతం చేసుకునే విషయంలో రామ్ విలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పరాస్, కుమారుడు చిరాగ్ పాశ్వాన్ల మధ్య పోటీ నెలకొన్నది. అనంతరం ఎన్నికల సంఘం (ఇసిఐ) ఎల్జెపి పేరును, చిహ్నాన్ని ఎవరికీ కేటాయించ కుండా నిలిపివేసింది. తర్వాత పశుపతి కుమార్ ఆర్ఎల్జెపికి, చిరాగ్ పాశ్వాన్ ఎల్జెపి(రామ్ విలాస్)కి నేతృత్వం వహించారు. ఎల్జెపికి ఉన్న ఎంపిలు పశుపతి కుమార్కు మద్దతిచ్చారు. బిజెపి కూడా కుమార్కు బాసటగా నిలిచి, 2021లో కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి ప్లేటు ఫిరాయించి, చిరాగ్ పాశ్వాన్తో సీట్ల ఒప్పందం కుదుర్చుకోవటం గమనార్హం. దీంతో, బిజెపి బీహార్లో బాబారు, అబ్బాయిల మధ్య చిచ్చు పెట్టిందని చర్చ నడుస్తోంది.