నాసిక్ (మహారాష్ట్ర) : మాలేగావ్ మాజీ మేయర్, ఎఐఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్పై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది.
నాసిక్ పోలీసుల వివరాల మేరకు … నగరంలో వేసవి ఉక్కపోతకు స్థానికులు అర్ధరాత్రి కూడా మెలకువగానే ఉండటం ఇక్కడ పరిపాటి. మహారాష్ట్ర ఎంఐఎం శాఖలో అబ్దుల్ ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంట 20 నిముషాల సమయంలో ఓల్డ్ ఆగ్ర రోడ్డులోని ఒక రెస్టారెంట్ ఎదుట అబ్దుల్ కూర్చొని ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మూడు తూటాలు అబ్దుల్ను తాకాయి. వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. ఛాతి ఎడమ భాగం, కుడి తొడ, కుడి చేయికి గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అబ్దుల్ ను నాసిక్లోని మరో వైద్యశాలకు తరలించారు. అబ్దుల్ మాలిక్పై దాడి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని సంయమనం పాటించాలని కోరారు. భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరించారు. నిందితుల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.