న్యూఢిల్లీ : పతంజలి సహ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది. ప్రకటనలు సమస్యలు సృష్టించినా .. వాటిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కఠిన చర్యలకు మీరు సిద్ధం కావాలని హెచ్చరించింది. ఇది కోర్టు ధిక్కరణే అని ధ్వజమెత్తింది. కేంద్ర ప్రభుత్వంపై కూడా మండిపడింది.
పతంజలి సంస్థపై చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వ కళ్లు మూసుకుని కూర్చోవడం తమని ఆశ్చర్యానికి గురి చేసిందని కోర్టు పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టడంపై రామ్దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణపై మండిపడింది.
గత నెల పతంజలి సమర్పించిన క్షమాపణ పత్రాలను అంగీకరించడానికి జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. మీ క్షమాపణల పట్ల తాము సంతోషంగా లేము అని జస్టిస్ హిమా కొహ్లీ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 10న విచారణకు రామ్దేవ్, బాలకృష్ణలను వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.